కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య చిత్రం
‘మిర్చి’ హిట్తో దర్శకునిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్న కొరటాల శివ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా అధినేత డి.వి.వి. దానయ్య ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి కొరటాల శివ మాట్లాడుతూ ‘నా తొలి సినిమా ‘మిర్చి’ విడుదలయ్యాక తనకొక సినిమా చేయమని దానయ్యగారు అడిగారు. ప్రస్తుతం నేను మహేశ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం చేస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రం తరువాత దానయ్యగారి సినిమా ఉంటుంది. ఒక అగ్ర హీరో అందులో నటిస్తారు’ అని చెప్పారు. నిర్మాత దానయ్య మాట్లాడుతూ ‘ఎప్పటినుంచో అనుకుంటున్న ప్రాజెక్ట్ ఇప్పటికి సెట్ అయింది. కొరటాల శివగారు ఈ చిత్రం కోసం అద్భుతమైన సబ్జెక్ట్ రెడీ చేశారు. ఓ అగ్రహీరోతో ఈ చిత్రాన్ని చాలా భారీ స్థాయిలో నిర్మిస్తాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు.