రుద్రమదేవి షూటింగ్ పూర్తయింది
అనుష్క ప్రధాన పాత్రధారిణిగా గుణా టీమ్ వర్క్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్న భారతదేశపు తొలి హిస్టారికల్ చిత్రం ‘రుద్రమదేవి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి సంబంధించిన చారిత్రక పరిశోధన, కథారూపకల్పన పనులు 2012లో మొదలయ్యాయి. అదే ఏడాది ఫిబ్రవరి 12న చిత్రం ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. 2013 ఫిబ్రవరిలో వరంగల్ వేయిస్థంభాల గుడిలో చేసిన పూజతో లాంఛనంగా మొదలైన ఈ చిత్రం ఈ నెల 4న హైదరాబాద్లోని గోపనపల్లెలో వేసిన ఏడు కోటగోడల సెట్లో చేసిన షూటింగ్తో పూర్తయింది.తెలుగుజాతి చరిత్ర, సాహసం కళ్లకి కట్టేలా భారీ స్థాయిలో ఈ చారిత్రక చిత్రం రూపుదిద్దుకొంది. అలాగే హాలీవుడ్ సాంకేతిక నిఫుణులతో స్టీరియో స్కోపిక్ 3డిలో నిర్మాణమైన తొలి భారతీయ సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ 3డి టెక్నాలజీ కచ్చితంగా ప్రేక్షకులకి అంతర్జాతీయ స్థాయి విజువల్ థ్రిల్ కలిగిస్తుంది. ఆ నమ్మకంతోనే చాలా ప్రాంతాల్లో ఎగ్జిబిటర్లు 3డి ప్రదర్శనకు అనుకూలంగా తమ థియేటర్లని సిద్ధం చేసుకోవడానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. 3డితో పాటు 2డి విధానంలో కూడా ఈ చిత్రం విడుదలవుతుంది. మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
రుద్రమదేవిగా అనుష్క, గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రంలో రానా, కృష్ణంరాజు, సుమన్, ప్రకాశ్రాజ్, నిత్యామీనన్, కేథరిన్, ప్రభ, జయప్రకాశ్రెడ్డి, ఆదిత్య మీనన్, ప్రసాదాదిత్య, అజయ్, విజయ్కుమార్, వేణుమాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిశోర్, కృష్ణభగవాన్, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, శివాజీరాజా, సమ్మెటగాంధీ, అదితి చెంగప్ప, సన, రక్ష ఇతర ముఖ్యతారాగణం. మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సీతారామశాసి్త్ర, ఫొటోగ్రఫీ: అజయ్ విన్సెంట్, కళ: తోట తరణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామగోపాల్, సమర్పణ: రాగిణీగుణ.
Source : Andhra jyothy news